ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు…
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
డిజిటల్ కార్డుల కోసం చేపడుతున్న పైలెట్ ప్రాజెక్టు ద్వారా వెల్లడయ్యే అనుభవాల ఆధారంగా సానుకూల, ప్రతికూల అంశాలపై సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టులో ఏవైనా లోపాలుంటే వాటిని సవరించుకుని పూర్తి స్థాయిలో చేపట్టాలని సూచించారు.
ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాలను ప్రాతిపదికగా ఎంపిక చేసుకుని, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన 238 ప్రాంతాల్లో బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వంటి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కార్డుల ప్రక్రియకు సంబంధించి ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాతిపదికన ప్రాంతాల ఎంపిక పూర్తయిందని అధికారులు తెలిపారు.
అక్టోబర్ 3 నుంచి 7 వరకు అయిదు రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు అందరూ సమ్మతిస్తే ఫోటో తీయాలని, అది ఒక ఆప్షన్ గా మాత్రమే ఉండాలని చెప్పారు.
రేషన్ కార్డు, పింఛను, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు వంటి కార్యక్రమాల్లో నమోదైన డేటా ఆధారంగా కుటుంబాల గుర్తింపునకు సంబంధించి ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని అధికారులు వివరించారు.
పైలెట్ ప్రాజెక్టులో వాటిని నిర్ధారించుకుంటూ కొత్త సభ్యులను చేర్చడం, కుటుంబంలో ఎవరైనా మృతి చెందినప్పుడు వారిని తొలగించడం వంటి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
Discover more from Elite Media Telugu News
Subscribe to get the latest posts sent to your email.