వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. హయగ్రీవ ఫామ్స్ కు చెందిన రూ. 44.74 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఈ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మరియు మేనేజింగ్ పార్ట్నర్ గద్దె బ్రహాజీలు ప్రధాన పాత్ర పోషించారని ఈడీ తన దర్యాప్తులో తేల్చింది.
ఈ భూములను విక్రయించి దాదాపు రూ. 150 కోట్లు సంపాదించినట్లు ఈడీ తెలిపింది. గతేడాది అక్టోబర్లో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఇళ్లు మరియు కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ కేసులో, అనాథలకి, వృద్ధులకి సేవ చేయడానికి కేటాయించిన భూములను వీరు అక్రమంగా ఆక్రమించుకున్నట్టు ఈడీ తేల్చింది. ఎండాడలోని హయగ్రీవ ప్రాజెక్ట్కు చెందిన 12.51 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కున్నట్లు గత ఏడాది జూన్ 22న చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి అరిలోవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఆరంభమైన దర్యాప్తు ఆధారంగా, ఈడీ అధికారులు విచారణ చేపట్టారు.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది, మరిన్ని ఆస్తులు, అక్రమ కార్యకలాపాలపై ఎడీ విచారణ చేపడుతుందని సమాచారం.