రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట: సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరణ, వేతనం చెల్లింపు

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం ఊరట కలిగించింది. ఆయన ఉద్యోగ సర్వీసు కాలానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ కాలాన్ని, చంద్రబాబు సర్కారు క్రమబద్ధీకరించింది.

2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు మొదటిసారిగా సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై, 2022 జూన్ నుంచి 2024 మే వరకు మరొకసారి సస్పెన్షన్ విధించబడింది. అయితే, తాజాగా ఈ సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వర్తించినట్లుగా మారుస్తూ, చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం, సస్పెన్షన్ కాలంలో విధులు నిర్వర్తించినట్లుగా పరిగణించి, ఆ కాలానికి సంబంధించిన వేతనాలు, అలవెన్సులు ఏబీ వెంకటేశ్వరరావుకు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ కాలం మొత్తం లెక్కించి, ఆయన విధులు నిర్వహించినట్లుగా భావించి, ఎంత మొత్తం ఇవ్వాలో అంత మొత్తం ఆయనకు చెల్లించాలని స్పష్టంగా పేర్కొంది.

ఇంతలో, ఏబీ వెంకటేశ్వరరావుపై గతంలో వైసీపీ ప్రభుత్వం వేసిన అభియోగాలను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ, తదుపరి నిర్ణయాలు తీసుకున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయంతో, ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి ఊరట పొందారు. ఆయనకు ప్రభుత్వపు ఈ నిర్ణయం, ఉద్యోగ కాలంలో జరిగిన వివాదాలపై మరింత స్పష్టత తీసుకొచ్చింది.

తాజా వార్తలు