అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టిన్ రైజర్ గారి నేతృత్వంలోని బృందం భేటీ అయింది.
ముఖ్యమంత్రి గారు గత నెలలో అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశం కాగా, తదుపరి చర్చల కోసం మార్టిన్ రైజర్ గారి బృందం హైదరాబాద్ వచ్చింది.
ఈ సందర్భంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా, వైద్య, సాగు నీటి రంగాలను తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి గారు వివరించారు. ఆయా ఆయా రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు.
విద్యా, వైద్య రంగాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికత బాగుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మార్టిన్ రైజర్ గారు ప్రశంసించారు. ప్రపంచ బ్యాంకు ఏ రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుందో అవే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని తెలిపారు.
సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, పలు విభాగాల ఉన్నతాధికారులు, వరల్డ్ బ్యాంక్ కంట్రీ ఆపరేషన్ హెడ్ పాల్ ప్రోసీ గారు, అర్బన్ ఇన్ఫ్రా, ప్రాజెక్ట్ లీడ్ నటాలియా కే గారు, డిజిటల్ డెవలప్మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ మహిమాపత్ రే గారు, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.