వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించి, గాంధీనగర్ జిల్లా జైలు నుంచి తిరిగి తాడేపల్లి బయలుదేరిన సమయంలో, ఒక అభిమాని తన కుమార్తెతో కలిసి జగన్ ను కలిసేందుకు వచ్చారు.
అప్పటికే అక్కడ భారీగా కార్యకర్తలు, అభిమానులు ఉండటంతో చిన్నారి, జగన్ను కలవలేకపోయింది. ఈ సమయంలో ఆ చిన్నారి ఒక్కసారిగా ఏడ్చేయడంతో, దాన్ని గమనించిన జగన్ తన కాన్వాయ్ను ఆపి, ఆ చిన్నారిని దగ్గరికి తీసుకుని నుదిటిపై ముద్దాడారు. అందుకు ఆనందంతో మమేకమైన చిన్నారి కూడా జగన్ను ముద్దాడింది. అనంతరం, ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారని సమాచారం.
ఈ సంఘటనతో ఆ చిన్నారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ నంతరం, ఆ చిన్నారి మరియు వైఎస్ జగన్ మధ్య ముద్దు, సెల్ఫీ తీసుకునే దృశ్యాల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక, ఈ రోజు, వైఎస్ జగన్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు. దాదాపు అర్ధగంట పాటు ఇద్దరు నాయకులు ముచ్చటించారు. ఈ సమావేశంలో వంశీ భార్య పంకజశ్రీ కూడా పాల్గొన్నారు.
గతంలో, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపిస్తూ, పోలీసులు వల్లభనేని వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే.