ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి:- భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు పరిహారం అందజేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఆయా శాఖల అధికారులతో ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై రివ్యూ చేశారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని అధికారులు తెలిపారు. దీంతో ఈనెల 25వ తేదీన బాధితులకు పరిహారం అందించాలని సిఎం నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులకు అత్యుత్తమ పరిహారాన్ని ప్రకటించారు. విజయవాడలో వరదకు మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ వారికి రూ.25వేలు, మొదటి, ఆపై అంతస్తు వారికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించనున్నారు. చనిపోయిన పశువులకు, నష్టపోయిన వ్యాపారులకు కూడా ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పరిహారం అన్ని వర్గాల బాధితులకూ ఒకే సారి చెల్లించనున్నారు. ఇళ్లు మునిగిన వారితో పాటు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం డబ్బులు బుధవారం అకౌంట్లలో నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది. నష్టపరిహారం విషయంలో తమ పేరు నమోదు కాలేదు అనే ఫిర్యాదు ఎక్కడా రాకూడదని సిఎం అధికారులకు సూచించారు. 10 వేల వాహనాలకు గాను ఇప్పటి వరకు 6 వేల వాహనాలకు బీమా సెటిల్మెంట్ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వాహనాలకు కూడా బీమా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Discover more from Elite Media Telugu News
Subscribe to get the latest posts sent to your email.