ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ 47 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది, తాజాగా బీజేపీ 29 స్థానాలకు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.

ఈ జాబితా ప్రకారం.. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి అరవింద్ కేజ్రవాల్ పై పర్వేశ్ వర్మను బీజేపీ పోటీకి దింపింది. బీజేపీ అభ్యర్థులు దుష్యంత్ గౌతమ్.. కరోల్ బాగ్ నుంచి, మంజీందర్ సింగ్ సిర్సా.. రాజౌరీ గార్డెన్ నుంచి పోటీ చేయనున్నారు. కొంతకాలం కిందట ఆప్ నుంచి బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్, అరవిందర్ సింగ్ లవ్లీలకు కూడా టికెట్లను కేటాయించారు. బిజ్వాసన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కైలాష్ గెహ్లాట్, గాంధీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అరవిందర్ సింగ్ లవ్లీని బరిలోకి దింపారు. ఆదర్శ్ నగర్ నుంచి రాజ్ కుమార్ భాటియా, బడ్లీ నుంచి దీపక్ చౌదరి, రిథాలా నుంచి కుల్వంత్ రాణా, నాంగ్ లోయ్ జాట్ నుంచి మనోజ్ షోకీన్, మంగోల్పురి నుంచి రాజ్కుమార్ చౌహాన్, రోహిణి నుంచి విజేంద్ర గుప్తాలను బీజేపీ బరిలోకి దించింది. ఇక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. మొత్తం 70 నియోజకవర్గాల్లో పార్టీ విజయాన్ని సాధించడంపై దృష్టి సారిస్తానని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సద్దదేవా గతంలో ప్రకటించారు. ఢిల్లీలో 25 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ.. రానున్న ఎన్నిక్లలో ఎలాగైనా విజయం సాధించేలా ప్రణాళికలు రచిస్తుంది.

ఇక, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ 2013 నుంచి న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోసారి అక్కడి నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో ఈ నియోజకవర్గం హై ప్రొఫైల్ను కలిగి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ కూడా న్యూఢిల్లీ స్థానానికి మాజీ సీఎం షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పేరును ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ మాజీ ఎంపీ పర్వేశ్ వర్మను బరిలో దింపింది. పర్వేశ్ వర్మ విషయానికి వస్తే.. ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. 2014 నుంచి 2024 వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. ఇక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి