ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఫిబ్రవరి 3న విడుదల కాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్పై దిశానిర్దేశం చేశారు. ఆయన ఎన్డీఏ పక్షాలతో సమన్వయ సమీక్షలు జరపాలని, ప్రజలకు మరింత బలం చేకూర్చే విధంగా పని చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా, చంద్రబాబు, “ఎమెల్సీ ఎన్నికలలో రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీల మధ్య సమన్వయంతో పని చేయాలి,” అని అన్నారు. అలాగే, “ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుంది. కేవలం రాత్రికి రాత్రే అన్నీ మారిపోతాయని మేము చెప్పట్లేదని,” చంద్రబాబు తెలిపారు.
ఈ క్రమంలో, రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలోని గాడి తప్పిన అంశాలను సరిదిద్దే పనిలో ఉన్నారని, ప్రభుత్వ పనులు జాగ్రత్తగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక, కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, అలాగే శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో, చంద్రబాబు, ఎన్డీఏ పార్టీలు మరింత బలంగా ఏకతారగా నిలబడాలని, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.