బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసినట్లు వెల్లడించారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిటీ (యూజీసీ) నిబంధనలను మార్చడం పై తమ అభ్యంతరాలను తెలియజేస్తూ వినతి పత్రం అందజేశామని చెప్పారు.
కేటీఆర్ మాట్లాడుతూ, కొన్ని నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించే విధంగా ఉన్నాయని, గవర్నర్లకు అధికారం ఇవ్వడం ద్వారా రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. “ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాన్ని దూరం చేసేలా రూపొందించబడినవి” అని ఆయన అన్నారు.
తమ అభిప్రాయాలను యూజీసీకి కూడా పంపినట్లు కేటీఆర్ చెప్పారు.
ఈ సందర్భంగా, కేటీఆర్ మరింతగా మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని” చెప్పారు. పార్టీలో ఫిరాయించిన నేతలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ అయ్యాయని, వారిపై అనర్హత వేటు పడాల్సిందేనని అన్నారు.
ఈ పర్యటన ముగించుకుని, కేటీఆర్ సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి బయల్దేరతారని ఆయన చెప్పారు.